మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి తో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు పట్ల నియోజకవర్గ ప్రజల హర్షం
ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్ సెప్టెంబర్ 07: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TGPS) మంజూరు కావడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, విద్యారంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.హుస్నాబాద్ కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందించేందుకు 73 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో మౌలిక వసతుల కల్పనకు రూ.699.895 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ 2026 సెప్టెంబర్ 5న G.O.Rt.No.164 జారీ చేసింది.
ఈ జాబితాలో కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా ఎంపిక చేశారు. ఈ పాఠశాల అభివృద్ధికి రూ.9.62 కోట్ల అంచనా వ్యయం కేటాయించారు.తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆధునిక మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం వల్ల చిగురుమామిడి మండలంతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రజలు పేర్కొన్నారు.విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.





























