కేంద్రమంత్రి బండి సంజయ్
ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, అక్టోబర్ 28: బాలికలను వేధిస్తే ఊరుకోమని -కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో యాకుబ్ బాషా అనే అటెండర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గత 5 రోజుల నుండే లోతైన విచారణ జరిపి నివేదిక తెప్పించుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. పోక్సో కేసు కావడంతో విషయం బయటకు వస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటకు రానియ్యలేదన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలడంతో ఈరోజు హెచ్ఎం ను కూడా సస్పెండ్ చేశారన్నారు. ఒకవేళ లైంగిక వేధింపుల విషయంలో హెచ్ఎం, ఇతర సిబ్బంది పాత్రపైనా విచారణ కొనసాగుతోందన్నారు. ఒకవేళ వారి పాత్ర కూడా ఉన్నట్లు తేలితే వారిపై పోక్సో కేసు నమోదు చేసేందుకు వెనుకాడొద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను కోరినట్లు తెలిపారు. ఈరోజు కరీంనగర్ లో ఓ ప్రైవేట్ చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్ద మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా పై విధంగా స్పందించారు.





























