•హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ సర్కార్
•వనపర్తి కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ మెరుపు ధర్నా
వనపర్తి ప్రతినిధి, సెప్టెంబర్ 07(ప్రతిపక్షం): ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారని బీఆర్ఎస్ నాయకులు వాకిటి శ్రీధర్,రమేష్ గౌడ్,నందిమల్ల అశోక్ లు విమర్శించారు.బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేయడానికి బయలుదేరితే రేవంత్ రెడ్డి అక్రమంగా అరెస్టు చేశారని నిరసిస్తూ సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు ర్యాలీగా వెళ్లి వనపర్తి కలెక్టరేట్ ముందు మెరుపు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్రమంగా అరెస్టు చేసిన బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.మహాలక్ష్మి పథకం కింద రూ.2,500, వృద్ధులకు రూ.4,000, బీడీ కార్మికులకు పెన్షన్ వంటి హామీలు అమలు కాలేదని, ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో పంటలు ఎండిపోయే ప్రమాదం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని, ప్రస్తుతం కనీసం తొమ్మిది గంటలు కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కావడం లేదని వారు ఆరోపించారు. కేసీఆర్ ఆలోచన మేరకు, కేటీఆర్ దిశానిర్దేశంతో హామీల అమలుపై నిరసనలు చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గంధంపరంజ్యోతి, కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్ మహిళా నాయకులు కవితా నాయక్, షేమిం బేగం,సీనియర్ నాయకులు ప్రేమ నాథ్ రెడ్డి,బండారుకృష్ణ,నాగన్నయాదవ్,రఘువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






























