ప్రతిపక్షం, జూలై 21: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, పోటీ పరీక్షల్లో అక్రమాలపై ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల సమస్యలకు లాఠీలతో కాకుండా సమాధానాలు, పారదర్శక చర్యలతో స్పందించాలని డిమాండ్ చేశారు.
యువత ఆకాంక్షలు నెరవేరకపోతే దేశంలో జెన్-జెడ్ ఉద్యమాలు తప్పవని తాను పది నెలల క్రితమే హెచ్చరించినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. ప్రశ్నపత్రాల లీకేజీలు, పోటీ పరీక్షల్లో అక్రమాలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని అన్నారు.
తమ సమస్యలపై ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగం చేయడం సరికాదని కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనలకు మూల కారణాలను పరిష్కరించకుండా నిరసనలను అణచివేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.



















