ప్రతిపక్షం, జూలై 23: సీజేపీ నిరసనలు, పోలీసుల దాడులకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విచారణలో భాగంగా తమ సమయాన్ని వృథా చేయొద్దని, ఘటనకు సంబంధించిన వీడియోలను చూసే సమయం తనకు లేదని సీజేఐ చేసిన వ్యాఖ్యలపై పలువురు ప్రతిపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలు స్పందించారు.
సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నార్థక గుర్తులతో స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో నాయకుడు సౌరవ్, ప్రభుత్వం సీజేఐకి తగిన సలహా ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ స్పందిస్తూ, “ఇది ప్రమాదకర పరిస్థితి.. ఇలాంటి సందర్భంలో ఇంకెవరు ప్రజల వాదన వింటారు?” అని ప్రశ్నించారు. శివసేన ఎంపీ ప్రియాంక కూడా “అమేజింగ్” అంటూ ఎక్స్లో స్పందించారు.
సీజేఐ వ్యాఖ్యలపై రాజకీయ, న్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ఈ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.


















