ప్రతిపక్షం, జూలై 23: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. 2019 ఇంటర్ ఫలితాల వ్యవహారంలో గ్లోబరీనా సంస్థ అవకతవకలకు పాల్పడిందని, ఆ సంస్థకు కేటీఆర్ బినామీ సంబంధాలు ఉన్నాయని సీఎం చేసిన ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన కేటీఆర్, తనకు గానీ, బీఆర్ఎస్ పార్టీకి గానీ గ్లోబరీనా సంస్థతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అలా చేయని పక్షంలో రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, నిరాధార ఆరోపణలతో పదవి గౌరవాన్ని దిగజార్చవద్దని సూచించారు.
అంతేకాకుండా నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వంటి కీలక అంశాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయ ప్రచారం చేయడం సరికాదని కేటీఆర్ విమర్శించారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత అని, రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

















