ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జులై 27: తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికుల పాత్ర మరువలేనిదని, వారి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వచ్చే ఆగస్టు 1వ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్న ఆటో కార్మిక దినోత్సవం ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆటో కార్మిక దినోత్సవంకు సంబంధించిన వాల్పోస్టర్లను నేడు వారి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారుఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోని సంక్షేమ ఫలాలను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు.ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఆటో కార్మికులు క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా, ఉద్యమకారులకు ఉచిత ప్రయాణాలు కల్పించి తమ మద్దతు తెలిపారనీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఆటో కార్మికులను అన్ని విధాలుగా ఆదుకున్నామని గంగుల గుర్తుచేశారు.
ప్రమాదవశాత్తు ఆటో కార్మికుడు మరణిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమా అందజేయడంతో పాటు, రోడ్ టాక్స్ మాఫీ చేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల బతుకులు కష్టాల్లో పడ్డాయని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. ఉచిత బస్సు కు వ్యతిరేకం కాదన్న గంగుల ప్రభుత్వం ఉచిత బస్సు ప్రకటన సమయంలో ఆటో కార్మికులకు నెలకు ఇస్తామన్న ఆర్థిక సహాయం (రూ. 1,000) హామీని ఇప్పటివరకు అమలు చేయలేదని ఎత్తిచూపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఆటో కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ప్రభుత్వం ఇస్తానన్న రూ. 12 వేల సహాయాన్ని అందించాలని, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, ఆటో కార్మీక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, ఎడ్ల అశోక్, ఐలేందర్ యాదవ్, గందే మహేష్, నాయకులు.. కర్ర సూర్య శేఖర్, నేతి రవి వర్మ, మిడిదొడ్డి నవీన్,జిపి స్వామి , ఆటో కార్మిక సంక్షేమ సంఘం బాధ్యులు.. పలువురు ఆటో డ్రైవర్లు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

















