కంట్రోల్ రూమ్ నంబర్ 7989193131
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 29: వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు 2026 జూలై 29, 30 తేదీల్లో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టరేట్లో 24 గంటల కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసర అవసరాలు మినహా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే వాగులు, వంకలు, చెరువులు, నీటి ప్రవాహాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.వర్షాల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనా వెంటనే 7989193131 నంబర్కు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. అందిన ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపడతారని తెలిపారు. ప్రజలు అధికార యంత్రాంగం సూచనలను పాటిస్తూ, వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తమ ప్రాణ, ఆస్తులను కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.





























