ప్రతిపక్షం, జూలై 29: సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయనకు అందుతున్న వైద్య చికిత్స, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య బృందానికి సూచించినట్లు సమాచారం.
అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యతో పాటు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన కవిత, ధైర్యంగా ఉండాలని సూచిస్తూ వారికి భరోసా కల్పించారు. సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.




















