ప్రతిపక్షం, జూలై 29: ప్రముఖ రిటైల్ దిగ్గజం డీమార్ట్ మెడికల్ రిటైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. డీమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్మార్కెట్స్ ప్రస్తుతం ముంబైలోని కొన్ని డీమార్ట్ స్టోర్లలో ప్రయోగాత్మకంగా ఫార్మసీ కౌంటర్లను ప్రారంభించింది. వినియోగదారులను ఆకర్షించేందుకు మందులపై 20 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీమార్ట్ స్టోర్లలో ఫార్మసీ సేవలను విస్తరించే యోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారులు తక్కువ ధరలకు మందులు కొనుగోలు చేసే అవకాశం లభించనుంది.
అయితే ఈ నిర్ణయం స్థానిక రిటైల్ మెడికల్ షాపులకు సవాలుగా మారే అవకాశముంది. ప్రస్తుతం చాలా ఫార్మసీలు మందులను గరిష్ఠ చిల్లర ధర (MRP)కు లేదా స్వల్ప తగ్గింపుతో విక్రయిస్తుండగా, డీమార్ట్ 20 శాతం తగ్గింపుతో మార్కెట్లోకి రావడం పోటీని మరింత పెంచే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
రిటైల్ రంగంలో ఇప్పటికే బలమైన స్థానం సంపాదించిన డీమార్ట్, ఇప్పుడు ఫార్మసీ విభాగంలోనూ విస్తరణకు సిద్ధమవుతుండటంతో మెడిసిన్ మార్కెట్లో ధరల పోటీ మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

















