ప్రతిపక్షం, ఆగస్టు 31: తమిళనాడులో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, తమిళగ వెట్రి కళగం మధ్య ప్రధాని అభ్యర్థిత్వంపై కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. 2029 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించకపోతే కాంగ్రెస్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి, కూటమి నుంచి బయటకు వస్తారని తమిళనాడు కాంగ్రెస్ మంత్రి రాజేశ్ కుమార్ హెచ్చరించారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్న నమ్మకం తమకు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ నాయకత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తితే కూటమిలో కొనసాగడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం కూటమిలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. ఈ కూటమిలో కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు దక్కినట్లు సమాచారం. అయితే 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఇప్పటి నుంచే చర్చలు ప్రారంభమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించాల్సిందేనన్న కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కూటమిలోని ఇతర పార్టీల వైఖరి ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పటి నుంచే స్పష్టమైన వైఖరిని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ తన రాజకీయ ప్రాధాన్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.





























