ప్రతిపక్షం, సెప్టెంబర్ 04: వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్వాద్ గ్రామంలో నిర్మిస్తున్న బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించాలనే లక్ష్యంతో చేపడుతున్న ఈ నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం దౌల్తాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. భవన నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, పనుల పురోగతిపై ఆరా తీశారు. నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






























