*రాజపేట తండా అట్రాసిటీ కేసులో డీఎస్పీ విచారణ.
*మర్రిగూడలో ఉప సర్పంచ్ ఫిర్యాదుతో ముగ్గురిపై అట్రాసిటీ కేసు.
ప్రతిపక్షం, మర్రిగూడ సెప్టెంబర్ 19: మర్రిగూడ మండలం రాజపేట తండా ఉప సర్పంచ్ కొర్ర సునీతపై దాడి, కులం పేరుతో దూషించారనే ఆరోపణలపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును శనివారం దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు విచారించారు.బుధవారం తనపై వార్డు సభ్యులు దాడి చేశారని ఆరోపిస్తూ ఉప సర్పంచ్ సునీత తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బి. రాంబాబుకు ఫిర్యాదు చేశారు. ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా కుదిరిన ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వలేదంటూ తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదు మేరకు పచ్చిపాల రాజు, ఆయన భార్య, బామ్మర్ది గడ్డి నరసింహులుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.కేసు దర్యాప్తులో భాగంగా డీఎస్పీ శ్రీనివాసరావు ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించి, బాధితురాలు, పోలీసుల నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. డీఎస్పీ విచారణ సందర్భంగా నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు, మర్రిగూడ ఎస్ఐ బి. రాంబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.





























