[t4b-ticker]

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు.. వారికి గుడ్‌న్యూస్

ప్రతిపక్షం, ఆగస్టు 02: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి మరో శుభవార్త అందించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలోని సీడీఎంఏ/క్యూర్ పరిధిలో నివసిస్తున్న అర్హుల కోసం దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డును తప్పనిసరిగా గుర్తింపు పత్రంగా జతచేయాల్సిన నిబంధన ఉండగా, తాజాగా ఇతర గుర్తింపు పత్రాలతో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ప్రభుత్వం చేసిన తాజా మార్పుల ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇకపై ఆధార్ కార్డుతో పాటు ఓటర్ గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలను కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా అధికారిక దరఖాస్తు వెబ్‌సైట్‌లో అవసరమైన సాంకేతిక మార్పులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

పథకం ప్రారంభ సమయంలో ఆధార్ కార్డును తప్పనిసరి పత్రంగా జతచేయాలనే నిబంధన అమల్లో ఉండేది. అయితే నగరాల్లో చాలా కాలంగా నివసిస్తున్న పలువురు లబ్ధిదారుల ఆధార్‌లో ఇప్పటికీ వారి స్వగ్రామ చిరునామాలే నమోదై ఉండటంతో దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిబంధనలను సడలించింది.

అయితే గుర్తింపు పత్రంగా ఇతర డాక్యుమెంట్లను జతచేసే అవకాశం కల్పించినప్పటికీ, దరఖాస్తులో ఆధార్ నంబర్ నమోదు చేయడం మాత్రం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ఆధార్ వివరాల ఆధారంగానే లబ్ధిదారుల అర్హతలు, ఇతర ప్రభుత్వ రికార్డులను పరిశీలించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

ఈ నిర్ణయంతో నగర ప్రాంతాల్లో నివసిస్తూ ఆధార్ చిరునామా మార్పు చేయించుకోని వేలాది మంది అర్హులకు ఊరట లభించనుంది. ముఖ్యంగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు, ఉద్యోగాల కోసం నగరాలకు వలస వచ్చిన కుటుంబాలు, చిరునామా మార్పు ప్రక్రియ పూర్తిచేయని అభ్యర్థులు ఇకపై సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం పొందనున్నారు.

ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు శాశ్వత గృహాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, అర్హులైన ఏ ఒక్కరూ అవకాశం కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Spread the love

Related News

Latest News