ప్రతిపక్షం, ఆగస్టు 21: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కొందరు వ్యాపారులు పండ్లను కృత్రిమంగా మగ్గబెడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ప్రమాదకర రసాయనాలు, కృత్రిమ రంగులను ఉపయోగించి మగ్గబెట్టిన భారీ మొత్తంలో అరటిపండ్లను ఆహార భద్రత అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల తనిఖీల్లో ఏకంగా 10,890 కిలోల అరటిపండ్లు కృత్రిమంగా మగ్గబెట్టినట్లు గుర్తించారు. అరటిపండ్లను త్వరగా పక్వానికి తీసుకురావడంతో పాటు ఆకర్షణీయమైన రంగులో కనిపించేలా చేసేందుకు రసాయనాలు, కృత్రిమ రంగులు వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల సమయంలో సంబంధిత రసాయనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
సహజంగా పండేందుకు సమయం పడుతున్నప్పటికీ.. అధిక లాభాల కోసం కొందరు వ్యాపారులు నిషేధిత లేదా ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి పండ్లను ముందుగానే మగ్గిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
అరటిపండ్లు కొనుగోలు చేసే సమయంలో వాటి రంగు, రూపం విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సహజంగా పండిన పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని, అనుమానాస్పదంగా కనిపించే పండ్లను కొనుగోలు చేయవద్దని అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా పండ్లను కృత్రిమంగా మగ్గించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.





























