ప్రతిపక్షం, జూలై 20: రాష్ట్రంలో ఈసారి గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఇప్పటికే పలు రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా తగ్గిపోయాయని, పంటలకు సాగునీరు అందించే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని తెలిపారు.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు ముందస్తుగా వరి నాట్లు వేయవద్దని మంత్రి సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేసే రైతులు కూడా పరిస్థితులను అంచనా వేసుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో వర్షపు నీటిని సమర్థంగా సంరక్షించాల్సిన అవసరం ఉందని తుమ్మల తెలిపారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టేలా ఇంకుడుగుంతల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి స్పష్టం చేశారు.
















