[t4b-ticker]

ప్రైవేట్ వ్యక్తులతో ప్రసాదాల తయారీ వద్దు: దేవదాయశాఖ

ప్రతిపక్షం, సెప్టెంబర్ 19: తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల తయారీకి సంబంధించి దేవదాయశాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై ప్రసాదాలను ప్రైవేట్ వ్యక్తులు, క్యాటరింగ్ సంస్థలతో తయారు చేయించవద్దని ఆలయ అధికారులను ఆదేశించింది. ఆలయ అధికారుల పర్యవేక్షణలోనే ప్రసాదాల తయారీ ప్రక్రియ కొనసాగించాలని స్పష్టం చేసింది.

ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవదాయశాఖ పేర్కొంది. భక్తులకు అందించే ప్రసాదాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు సూచించింది. తయారీ నుంచి భక్తులకు పంపిణీ చేసే వరకు ప్రతి దశలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

ఈ మేరకు దేవదాయశాఖ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల తయారీని సంబంధిత ఆలయ అధికారుల సమక్షంలోనే నిర్వహించాలని పేర్కొంది. ప్రైవేట్ వ్యక్తులు లేదా బయటకు చెందిన క్యాటరింగ్ సంస్థలకు ప్రసాదాల తయారీ బాధ్యతలను అప్పగించకూడదని స్పష్టం చేసింది.

ప్రసాదాల తయారీలో నాణ్యమైన పదార్థాలను ఉపయోగించడంపై కూడా శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. నెయ్యి వినియోగించే ప్రసాదాల తయారీలో విజయ నెయ్యినే ఉపయోగించాలని సూచించింది. ప్రసాదాల రుచి, నాణ్యతతో పాటు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని పదార్థాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.

అవసరమైన సిబ్బంది కొరత ఉన్న ఆలయాలు ఆలయం తరఫున ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించుకోవచ్చని దేవదాయశాఖ సూచించింది. అయితే ప్రసాదాల తయారీ బాధ్యతలను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు అప్పగించకుండా ఆలయ అధికారుల పర్యవేక్షణలోనే ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేసింది.

తాజా నిబంధనలతో ఆలయాల్లో భక్తులకు అందించే ప్రసాదాల తయారీ, నాణ్యత నియంత్రణపై ఆలయ యంత్రాంగం బాధ్యత మరింత పెరగనుంది. భక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులను తగ్గించడంతో పాటు ప్రసాదాల నాణ్యతను మెరుగుపరిచేందుకు ఈ మార్పులు తీసుకొచ్చినట్లు దేవదాయశాఖ తెలిపింది.

Spread the love

Related News

Latest News