ప్రతిపక్షం, జూలై 22: తెలంగాణలో రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, చెట్ల కింద, బలహీన నిర్మాణాల వద్ద నిలవవద్దని సూచించారు.
ఇక ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు హైదరాబాద్ నగరంలోనూ ముసురు వాతావరణం కొనసాగుతుండగా, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


















