ప్రతిపక్షం, జూలై 27: హైడ్రా కమిషనర్ రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ను హైకోర్టు ఆదేశించింది. లోతుకుంట ప్రైవేట్ భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యాన్ని తీవ్రంగా తప్పుబట్టిన న్యాయస్థానం, కోర్టు ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ కేసుకు సంబంధించిన 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైడ్రా వ్యవహార శైలిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సెక్రటరీ హోదాలో ఉన్న అధికారి కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది.
రంగనాథ్ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి, ఆ స్థానంలో అర్హత కలిగిన అధికారిని వెంటనే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను గౌరవించడం ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత అని న్యాయస్థానం స్పష్టం చేసింది.


















