ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు.
ప్రతిపక్షం, జులై 28, వనపర్తి ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్కలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు పలువురు కేంద్ర మంత్రులను, పార్లమెంటు కలిసి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలపై సోమవారం జంతర్ మంతర్ లో ధర్నా నిర్వహించిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ తదితరులు మంగళవారం కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, టీఆర్ ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర తదితరులకు వినతిపత్రాలు అందజేశారు.
దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు ఉన్న రైల్వే రాయితీ పాస్ లను గత కోవిడ్ సందర్భంగా రద్దు చేశారని, ఈ సదుపాయాన్ని పునరుద్దరించాలని వారు కోరారు. దేశవ్యాప్తంగా రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పిస్తూ జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు పార్లమెంటులో ప్రత్యేక చట్టం చేయాలని వారు కోరారు. జర్నలిస్టులకు, సొసైటీలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించే విషయం పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించి జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన ఆయా సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు కుంచం శ్రీనివాస్, పర్కాల సమ్మయ్య గౌడ్, కె.రమాదేవి, పద్మనాభరావు,నాయకులు గోపాల్, మోయిజ్ , వనపర్తి జర్నలిస్ట్ బాలరాజు తదితరులు ఉన్నారు.

















