హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్‌ సర్కార్‌..!

ప్రతిపక్షం, జూలై 27: హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రంగనాథ్‌కు మద్దతుగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఈ వ్యవహారంపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్‌ను ఢిల్లీకి పంపినట్లు సమాచారం. హైకోర్టు పూర్తి తీర్పు ప్రతిని పరిశీలించిన అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాలు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, లోతుకుంట భూముల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనను కమిషనర్ పదవి నుంచి తొలగించి, అర్హత కలిగిన అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్ల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

Spread the love

Related News

Latest News