ప్రతిపక్షం, జూలై 22: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో పలు కీలక అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ, తాను మరియు సంబంధిత మహిళ గతంలో వివాహం చేసుకోవాలని భావించామని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పిటిషన్ ప్రకారం, తనకు మరో మహిళతో సంబంధం ఉందన్న అపోహతో ఆమె వేరొకరిని వివాహం చేసుకుందని, అనంతరం వాస్తవం తెలుసుకుని మళ్లీ తనను సంప్రదించేదని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. ఫోన్లో మాట్లాడటంతో పాటు తన నివాసానికి కూడా వచ్చేదని ఆయన వివరించినట్లు తెలుస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తనను ప్రశ్నించగా, తానే వేధిస్తున్నానని ఆమె చెప్పిందని పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం ఆమె భర్త తనతో ఫోన్లో మాట్లాడి తనదే తప్పు అని ఆరోపించడంతో, తమ ఇద్దరూ కలిసి ఉన్న వీడియోను అతనికి పంపానని ఉదయ్ కృష్ణారెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతుండగా, పిటిషన్లో చేసిన ఈ వాదనలపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. కేసుకు సంబంధించిన పూర్తి వాస్తవాలు దర్యాప్తు అనంతరం మాత్రమే స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.

















