ప్రతిపక్షం, జూలై 20: పామాయిల్ రైతులకు మరింత మేలు జరిగేలా ధర పెంపునకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ సంస్థ నిర్మించిన నూతన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఆయన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతమని, రైతులు అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశంలో పామాయిల్కు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ఉత్పత్తి తక్కువగా ఉందన్నారు. గతంలో టన్ను పామాయిల్ గెలల ధర రూ.12 వేలు ఉండగా ప్రస్తుతం రూ.23 వేలకు పెరిగిందని తెలిపారు. అంజనాపురం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఖమ్మం జిల్లా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

















