ప్రతిపక్షం, జూలై 27: శాంతియుతంగా నిరసనలు చేపట్టిన విద్యార్థులపై ఈ నెల 20న జరిగిన పోలీసు చర్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆ ఘటనలో జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేస్తూ, పోలీసుల చర్యలకు సంబంధించిన పలు ప్రశ్నలను లేవనెత్తారు.
లేఖలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, నిరసన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ గన్లు, టియర్ గ్యాస్తో పాటు ఇతర బలవంతపు చర్యలు ప్రయోగించారని ఆరోపించారు. ఈ ఘటనలో వందలాది మంది విద్యార్థులు గాయపడినట్లు పేర్కొంటూ, వారిపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
విద్యార్థులపై పెల్లెట్ గన్ల వినియోగానికి అనుమతి ఇచ్చింది ఎవరు? సివిల్ డ్రెస్లో వచ్చిన వ్యక్తులు నిరసనకారులపై దాడులు చేయడానికి అధికారం ఎవరు కల్పించారు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసనలు వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆ హక్కును అణచివేసే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని, విద్యార్థులపై జరిగిన బలప్రయోగానికి బాధ్యులైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ తన లేఖలో కోరారు. మరోవైపు, ఈ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర హోంశాఖ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

















