ఐస్ విక్రేత అవగాహనకు రాహుల్ ప్రశంసలు.. వైరల్ అయిన కార్మికుడి కథ

ప్రతిపక్షం, జూలై 28: ఢిల్లీలో కార్మికుల ఆందోళనల నేపథ్యంలో ఓ సాధారణ ఐస్ విక్రేత చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రోజుకు సుమారు ₹500 సంపాదిస్తూ జీవనం సాగించే ఇర్ఫాన్ అనే కార్మికుడు కార్మికుల సమస్యలు, చట్టాల్లోని లోపాలు, రాజ్యాంగ హక్కులపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి.

చదువు ఎక్కువగా లేకపోయినా, గూగుల్, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా రాజ్యాంగం, పౌర హక్కులపై అవగాహన పెంచుకున్నానని ఇర్ఫాన్ తెలిపారు. తనలాంటి సాధారణ కార్మికుల కష్టాలను ధైర్యంగా వివరించిన ఆయన మాటలు నెటిజన్ల ప్రశంసలు అందుకున్నాయి.

ఈ వీడియోలు వైరల్ కావడంతో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా ఇర్ఫాన్ ఇంటికి వెళ్లి ఆయనను అభినందించారు. సమాజ సమస్యలపై అవగాహన పెంచుకుని ధైర్యంగా తన అభిప్రాయాన్ని వెల్లడించినందుకు ఆయనను ప్రశంసించారు.

అయితే ఢిల్లీలో జరిగిన నిరసనల అనంతరం కొన్ని రాజకీయ నాయకులు సంబరాలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ, అదే ఉద్యమంలో పాల్గొన్న ఇర్ఫాన్ మాటలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఆయన సాధారణ జీవితం, సామాజిక అంశాలపై ఉన్న అవగాహన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విశేషంగా చర్చనీయాంశమవుతోంది.

Spread the love

Related News

Latest News