ప్రతిపక్షం, జూలై 30: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి యువతిని మోసం చేసిన వ్యక్తిపై హైదరాబాద్లో కేసు నమోదైంది. వరంగల్కు చెందిన ఓ యువతికి విజయరామరాజు అనే వ్యక్తి ఉద్యోగం కల్పిస్తానంటూ పరిచయం పెంచుకుని, అనంతరం ఆమెను మానసికంగా వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఉద్యోగం ఇప్పిస్తాననే నమ్మకంతో ఇద్దరి మధ్య సన్నిహిత పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువతితో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడిన నిందితుడు, ఆ దృశ్యాలను అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
తాను చెప్పినట్లు వినకపోతే వీడియోలను సోషల్ మీడియాలో, కుటుంబ సభ్యులకు పంపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. వేధింపులు తీవ్రస్థాయికి చేరుకోవడంతో బాధితురాలు హైదరాబాద్లోని ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించింది.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఘటనకు సంబంధించిన పరిధి దృష్ట్యా కేసును మహేశ్వరం పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. నిందితుడి చర్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ వేధింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

















