ప్రతిపక్షం, జూలై 30: స్మార్ట్ఫోన్ వినియోగం పెరుగుతున్న కొద్దీ యువతలో మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు, కీళ్ల నొప్పులు కూడా అధికమవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి తలను కిందికి వంచి మొబైల్ చూడడం వల్ల మెడపై తీవ్రమైన ఒత్తిడి పడుతోందని చెబుతున్నారు.
సాధారణంగా తలను నిటారుగా ఉంచినప్పుడు మెడపై సుమారు 5 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. అయితే తలను 60 డిగ్రీల వరకు కిందికి వంచి ఫోన్ చూస్తే వెన్నెముకపై దాదాపు 22 కిలోల వరకు ఒత్తిడి పడే అవకాశం ఉందని వైద్యులు వివరిస్తున్నారు. దీని వల్ల మెడ కండరాలు బలహీనపడటంతో పాటు దీర్ఘకాలంలో వెన్నెముక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యలను నివారించాలంటే మొబైల్ను కంటి చూపు ఎత్తులో పట్టుకుని ఉపయోగించడం, చేతులకు లేదా మోచేతులకు సరైన సపోర్ట్ ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండకుండా ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చిన్న విరామం తీసుకుని, కళ్లకు, మెడకు విశ్రాంతి కల్పించాలని సూచిస్తున్నారు.
అదేవిధంగా ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడం, తరచూ మెడ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం, సరైన కూర్చునే భంగిమ పాటించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను చాలా వరకు నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

















