[t4b-ticker]

సనత్‌నగర్ టిమ్స్‌కు మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు

ప్రతిపక్షం, జూలై 31, హైదరాబాద్: సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రికి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ ఆసుపత్రి ‘డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సనత్‌నగర్’ పేరుతో కొనసాగనుంది.

హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సనత్‌నగర్‌లో ఈ ఆసుపత్రిని నిర్మించారు. సుమారు వెయ్యి పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వివిధ రకాల అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

రాష్ట్ర అభివృద్ధిలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత రాజకీయాల్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తిస్తూ సనత్‌నగర్‌లో నిర్మించిన ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆసుపత్రి అధికారిక పేరు మారనుంది. ఇకపై ప్రభుత్వ రికార్డులు, అధికారిక వ్యవహారాల్లోనూ ఇదే పేరును ఉపయోగించనున్నారు. నగర ప్రజలకు మెరుగైన, అత్యాధునిక వైద్య సేవలను అందించే కీలక ఆరోగ్య కేంద్రంగా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Spread the love

Related News

Latest News