ప్రతిపక్షం, ఆగస్టు 25: శివ భక్తులకు ఈ రోజు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ప్రతి నెల త్రయోదశి తిథిని ప్రదోష వ్రతంగా ఆచరించడం ఆనవాయితీ. ఈసారి ప్రదోషం మంగళవారం రావడంతో దీనిని భౌమ ప్రదోష వ్రతంగా పిలుస్తారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో పరమశివుడిని ఆరాధిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
భౌమ ప్రదోష వ్రతాన్ని ఆచరించే భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష కాలంలో శివారాధన చేయడం శ్రేయస్కరమని చెబుతున్నారు. శివుడికి అభిషేకం నిర్వహించి బిల్వపత్రాలు, పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహం పొందవచ్చని భక్తుల విశ్వాసం.
ప్రదోష కాలంలో సమీపంలోని శివాలయానికి వెళ్లి పరమశివుడితో పాటు నందీశ్వరుడిని దర్శించుకోవడం విశేష ఫలితాలను ఇస్తుందని పురోహితులు పేర్కొంటున్నారు. ఆలయంలో జరిగే అభిషేకాలు, ప్రత్యేక పూజలను దర్శించుకోవడంతో మనసుకు ప్రశాంతత కలగడంతో పాటు కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయని భక్తులు విశ్వసిస్తారు.
భౌమ ప్రదోషం రోజున శివుడిని పూజించడం వల్ల దోషాలు తొలగి, అనుకున్న కార్యాలు సాఫల్యం చెందుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం, ఆరోగ్యం, సకల సంపదలు చేకూరుతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా మంగళవారం కావడంతో శివారాధనతో పాటు ఉపవాసం, ధ్యానం, దానధర్మాలు చేయడం మంచిదని పెద్దలు సూచిస్తున్నారు.
ప్రదోష సమయంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు నందీశ్వరుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. శివనామస్మరణ, పంచాక్షరీ మంత్ర జపం, శివ స్తోత్రాల పఠనం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
అయితే ఉపవాసం చేసే వారు తమ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. భక్తి, శ్రద్ధలతో శివుడిని స్మరించడం ముఖ్యమని పురోహితులు చెబుతున్నారు. ఈ భౌమ ప్రదోష వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి పరమశివుడి అనుగ్రహం పొందాలని శివ భక్తులు కోరుకుంటున్నారు.





























