ప్రతిపక్షం, ఆగస్టు 28: జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉండాల్సిన వైద్యులు గైర్హాజరు కావడం, ప్రైవేటు వైద్యుడితో చికిత్స అందించడంపై వచ్చిన వార్తలపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత, విధుల్లో వైద్యుల గైర్హాజరు వంటి అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. బాధ్యులుగా తేలిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యులు విధులకు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు.





























