ప్రతిపక్షం, ఆగస్టు 30: మనిషి జీవితంలో నిజమైన ఎదుగుదల అంటే వయసు పెరగడం మాత్రమే కాదని, ఆలోచనా విధానంలో మార్పు రావడమే అసలైన పరిణతి అని పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ ఆయన చేసిన ఆసక్తికరమైన సామాజిక మాధ్యమ పోస్టు ప్రస్తుతం నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.
మనిషి ఎదుగుదలలో మూడు దశలు ఉంటాయని హర్ష్ గోయెంకా తన పోస్టులో వివరించారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు తొలుత ఇతరులను బాధ్యులుగా భావించడం సాధారణమని పేర్కొన్నారు. ఏదైనా తప్పు జరిగినా, పరిస్థితులు అనుకూలించకపోయినా.. అందుకు కారణం ఎదుటివారేనని నిందించే దశ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందని తెలిపారు.
ఆ తర్వాత వచ్చే దశలో మనిషి తనను తాను ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తాడని చెప్పారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తప్పులు, తన ప్రవర్తన వంటి అంశాలను పరిశీలించుకుంటూ ‘ఇందులో నా తప్పు ఏమిటి?’ అని ఆలోచించడం మొదలవుతుందని వివరించారు. ఈ దశలో ఆత్మపరిశీలన పెరుగుతుందని, తన తప్పులను గుర్తించుకునే సామర్థ్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అయితే నిజమైన పరిణతి మూడో దశలో వస్తుందని హర్ష్ గోయెంకా అభిప్రాయపడ్డారు. ఇతరులను నిందించినా, తనను తాను నిందించుకున్నా గతంలో జరిగిన విషయాలు మారవని, నిందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఒక దశలో మనిషి తెలుసుకుంటాడని తెలిపారు. అప్పుడే పరిస్థితులను అర్థం చేసుకుని, సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటూ ముందుకు సాగడం ప్రారంభిస్తాడని వివరించారు.
‘ఏ రోజైతే నిందలు వేయడం ఆపేస్తామో.. ఆ రోజే మనం నిజంగా ఎదిగినట్లు’ అనే భావాన్ని ఆయన తన పోస్టు ద్వారా వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి ఎవరినో ఒకరిని బాధ్యులుగా చూపించడం కంటే, జరిగిన విషయాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడమే అసలైన మెచ్యూరిటీ అని ఆయన సందేశం సూచిస్తోంది.
హర్ష్ గోయెంకా చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలు, సమస్యలు, సంబంధాల్లో ఏర్పడే విభేదాల సమయంలో మనం ఎలా స్పందిస్తున్నామన్నదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇతరులను నిందించడం నుంచి ఆత్మపరిశీలనకు, అక్కడి నుంచి నిందలకతీతంగా పరిష్కారాల వైపు వెళ్లడమే నిజమైన వ్యక్తిగత ఎదుగుదలకు సంకేతమని ఈ సందేశం చెబుతోంది.





























