ప్రతిపక్షం, ఆగస్టు 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఒకేసారి 10 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లను బల్క్గా బుక్ చేసుకునే ప్రయాణికులకు ఇంటి వద్ద నుంచే బస్సు ఎక్కే సదుపాయాన్ని కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ముఖ్యంగా సూపర్ లగ్జరీ, ఏసీ, స్లీపర్ బస్సుల్లో ప్రయాణించే పెద్ద సమూహాలకు ఈ సదుపాయం ఉపయోగపడనుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు లేదా ఇతర బృందాలు కలిసి ప్రయాణించేటప్పుడు సాధారణంగా అందరూ ఒకే ప్రాంతం నుంచి బస్టాండ్కు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందిని తగ్గించేందుకు ఆర్టీసీ ఈ కొత్త విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది.
ఈ పథకాన్ని తొలుత విజయవాడలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అక్కడ ప్రయోగాత్మకంగా సేవలు విజయవంతమైతే ప్రయాణికుల స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు దశలవారీగా విస్తరించే అవకాశం ఉంది.
10కి పైగా టికెట్లు ఒకేసారి బుక్ చేసుకున్న వారికి ఇంటి వద్ద నుంచి పికప్ సదుపాయం కల్పించే విధానం, ముందస్తు బుకింగ్ ప్రక్రియ, పికప్ ప్రాంత పరిధి, అదనపు ఛార్జీలు ఉంటాయా లేదా అనే అంశాలపై అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రయాణికులకు సమయం ఆదా చేయడంతో పాటు, పెద్ద సంఖ్యలో ఒకే చోటకు చేరుకోవాల్సిన అవసరాన్ని తగ్గించడం ఈ సేవ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పండుగలు, సెలవులు, వివాహాలు, కుటుంబ కార్యక్రమాల సమయంలో పెద్ద బృందాలు ఒకేసారి ప్రయాణించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడే అవకాశం ఉంది.
ఈ సేవకు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీసీ అధికారులు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. బల్క్ టికెట్ బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు ఇంటి వద్దకే పికప్ సదుపాయం అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగే అవకాశం ఉంది.





























