ప్రతిపక్షం, ఆగస్టు 30: తెలంగాణలో నిషేధిత భూముల జాబితా నుంచి భూములను తొలగించే అంశంపై మంత్రి పొంగులేటిపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “పొంగులేటి కాదు.. పొంగులూటీ” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నిషేధిత భూముల జాబితాలోని 98 శాతం భూములను తొలగిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పటికీ 50,565 ఎకరాలు ఆ జాబితాలో ఎందుకు ఉన్నాయని హరీశ్రావు ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని విమర్శించారు.
ఎలాంటి దరఖాస్తు చేయకుండానే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటిని నిషేధిత జాబితా నుంచి ఎలా తొలగించారని హరీశ్రావు ప్రశ్నించారు. ప్రజలకు ఒక న్యాయం, ప్రభుత్వ పెద్దలకు మరో న్యాయమా అని నిలదీశారు.
“మీ ఇళ్లు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లే.. సామాన్య ప్రజల ఇళ్లు, భూములను కూడా జాబితా నుంచి తొలగించాలి” అని హరీశ్రావు డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా భూముల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాలని కోరారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై కూడా హరీశ్రావు విమర్శలు చేశారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను రాహుల్గాంధీ పట్టించుకోకుండా సర్కస్ చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
నిషేధిత భూముల జాబితా నుంచి భూముల తొలగింపు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి భూములు, ఇళ్లను జాబితా నుంచి తొలగించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.





























