- రెండు షెడ్లు ధ్వంసం.. డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు
- తృటిలో తప్పిన పెను ప్రమాదం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం
ప్రతిపక్షం, మానకొండూర్, సెప్టెంబర్ 1: కరీంనగర్ జిల్లా ఎనిమిదో డివిజన్ అలుగునూర్లో మంగళవారం ఉదయం డ్రైవర్ అజాగ్రత్తతో గూడ్స్ లారీ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. రాజీవ్ రహదారి పక్కనే ఉన్న మెకానిక్ జాప మధుసూదన్రెడ్డి ఇంట్లోకి లారీ దూసుకెళ్లడంతో అక్కడి రెండు షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.ప్రమాద ధాటికి లారీ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం సైతం విరిగిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని మెకానిక్ జాప మధుసూదన్రెడ్డి తెలిపారు. ఘటనపై ఎల్ఎండీ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.





























