- సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
- కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
ప్రతిపక్షం, కరీంనగర్, సెప్టెంబర్ 1: కరీంనగర్లో న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విధులకు హాజరయ్యారు.ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని జేఏసీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ మోసానికి నిరసనగా సెప్టెంబర్ 1ను ‘పెన్షన్ ద్రోహ దినం’ గా పాటిస్తూ ఉద్యమిస్తున్నామని తెలిపారు.
తక్షణమే రెండో పీఆర్సీని అమలు చేయాలని, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సంబంధించిన సుమారు రూ.10 వేల కోట్ల బకాయి బిల్లులను చెల్లించడంతో పాటు ఈహెచ్ఎస్ ఆరోగ్య పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు.ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని, ఉద్యోగుల హక్కుల సాధనలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.





























