ప్రతిపక్షం, సెప్టెంబర్ 01: రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చిన 22ఏ నిబంధనను రద్దు చేయకపోతే అసెంబ్లీ సమావేశాలను సజావుగా సాగనివ్వబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు కన్నీరు పెడితే రాజ్యాలు కూలిపోతాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. 22ఏ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం 22ఏ నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రాంచందర్రావు పాల్గొని మాట్లాడారు. రైతుల భూముల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నిషేధిత జాబితాలో భూములను చేర్చడంతో వాటిని విక్రయించుకోవడం, అవసరమైన సమయంలో ఆస్తిని వినియోగించుకోవడం రైతులకు కష్టంగా మారిందన్నారు.
22ఏ విషయంలో ప్రభుత్వం తప్పు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంగీకరించారని రాంచందర్రావు పేర్కొన్నారు. తప్పిదం వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 22ఏలో భూములను చేర్చిన వ్యవహారంపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు న్యాయ విచారణ జరిపించాలని కోరారు. రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు బీజేపీ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అక్రమంగా విక్రయిస్తోందని రాంచందర్రావు ఆరోపించారు. వందలాది మంది రైతులు తమ భూములను కాపాడాలని కోరుతూ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మెదక్ ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ.. భూముల వ్యవహారంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల భూములు 22ఏ నిషేధిత జాబితా నుంచి ఏ దరఖాస్తుల ఆధారంగా తొలగించారో వెల్లడించాలని ప్రశ్నించారు. రైతుల భూములను మాత్రం నిషేధిత జాబితాలో ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. 22ఏ కారణంగా రైతులు తమ భూములను అవసరానికి అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో రైతులు తీవ్ర నిర్ణయాలకు పాల్పడితే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు, ధరణి వ్యవస్థలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
రైతుల భూముల సమస్యను తక్షణమే పరిష్కరించి, 22ఏ నిబంధనపై స్పష్టమైన విధానం ప్రకటించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.





























