ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: తెలంగాణలో మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంతో ఏర్పడిన ఖాళీని ఎవరితో భర్తీ చేయాలనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఖాళీ అయిన మంత్రి పదవిపై పలువురు కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
మంత్రి పదవి కోసం కాంగ్రెస్లో పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్, ప్రేమ్సాగర్రావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పేర్లు ఆశావహుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అయితే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కొండా సురేఖ స్థానంలో మళ్లీ బీసీ వర్గానికి చెందిన నేతకే మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఆశావహుల అంచనాలు, అధిష్ఠానం ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయన్నదే ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది.
మంత్రి పదవి కోసం ఆశిస్తున్న పలువురు నేతలు ఇప్పటికే పార్టీ అధిష్ఠానాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఏఐసీసీకి తమ అభ్యర్థిత్వాన్ని తెలియజేస్తూ విజ్ఞప్తులు చేసినట్లు తెలుస్తోంది. తమకు అవకాశం కల్పించాలని కోరుతూ పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఖాళీ అయిన పదవిని భర్తీ చేయడంతో పాటు.. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీ కోసం పనిచేసిన నేతల సేవలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
కొండా సురేఖ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఒకవైపు పలువురు సీనియర్ నేతలు పదవి కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు బీసీ వర్గానికి ప్రాతినిధ్యం కొనసాగించాలన్న ఆలోచన ఉందన్న ప్రచారం ఆశావహుల్లో మరింత ఉత్కంఠ పెంచుతోంది. చివరకు ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై ఏఐసీసీ, పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది.
ఇప్పటికే ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి పదవి అంశం హాట్టాపిక్గా మారింది. అధిష్ఠానం నిర్ణయం వెలువడే వరకు పలువురు నేతల పేర్లపై చర్చ కొనసాగే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యం ఇస్తారా.. సీనియారిటీ, రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారా.. లేక పార్టీ కోసం పనిచేసిన మరో నేతకు అవకాశం కల్పిస్తారా అన్నదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.





























