ప్రతిపక్షం, ఆగస్టు 18, హైదరాబాద్: నగర ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించే దిశగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులకు కీలక అడుగులు పడుతున్నాయి. రెండో దశ మెట్రో నిర్మాణానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ చర్యలు ప్రారంభించింది. ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు, టెండర్లు, ఇతర సాంకేతిక ప్రక్రియలను పర్యవేక్షించేందుకు జనరల్ కన్సల్టెంట్ను నియమించే ప్రక్రియను చేపట్టనుంది.
మెట్రో ఫేజ్-2లో మొత్తం నాలుగు ప్రధాన కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. నాగోల్–ఎయిర్పోర్ట్, రాయదుర్గం–కోకాపేట్, ఎల్బీనగర్–హయత్నగర్, ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట మార్గాల్లో మెట్రో రైలు మార్గాలను నిర్మించనున్నారు. ఈ నాలుగు కారిడార్లు కలిపి సుమారు 63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ అందుబాటులోకి రానుంది.
ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.21,560 కోట్లుగా ఉంది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెరో 20 శాతం చొప్పున నిధులు సమకూర్చనున్నాయి. మిగిలిన 60 శాతం నిధులను రుణాల రూపంలో సమీకరించేలా ప్రణాళిక రూపొందించారు.
ఫేజ్-2 పూర్తయితే హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న మెట్రో నెట్వర్క్కు మరింత విస్తరణ లభించనుంది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలను ఎయిర్పోర్టుతో అనుసంధానించడంతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎల్బీనగర్, హయత్నగర్, కోకాపేట్, చాంద్రాయణగుట్ట వంటి ప్రాంతాలకు మెరుగైన ప్రజా రవాణా సదుపాయం కలగనుంది.
మెట్రో విస్తరణతో రోడ్లపై పెరుగుతున్న వాహన రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు, టెండర్లు, సాంకేతిక అంశాలపై జనరల్ కన్సల్టెంట్ నియామకం అనంతరం మరింత స్పష్టత రానుంది. నగర భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫేజ్-2ను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.





























