ప్రతిపక్షం, ఆగస్టు 28, హైదరాబాద్: నగరంలో క్యాబ్ ప్రయాణం ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి చివరకు మోసానికి దారితీసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తనకంటే ఎనిమిదేళ్లు పెద్దదైన యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు ఆమె వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకుని మరో యువతిని వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. బుద్ధానగర్కు చెందిన 29 ఏళ్ల యువతి హైదరాబాద్లోని ఓ సంస్థలో పనిచేస్తోంది. ఆమె నిత్యం విధులకు వెళ్లేందుకు లక్ష్మణ్ అనే 21 ఏళ్ల యువకుడి క్యాబ్ను ఉపయోగించేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తరచూ క్యాబ్లో కలిసి ప్రయాణించడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి చివరకు ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.
లక్ష్మణ్ తనను పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నమ్మకంతో యువతి అతడికి సుమారు రూ.20 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. కొంతకాలం ఇద్దరూ సన్నిహితంగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత లక్ష్మణ్ మరో యువతిని వివాహం చేసుకున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.20 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ యువతి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించింది. తన వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ ఫిర్యాదుపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి నుంచి డబ్బులు తీసుకున్న విధానం, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఆర్థిక లావాదేవీలు, వివాహానికి సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.





























