ఆన్‌లైన్ కుదరదు కోర్టుకు రావాల్సిందే.. అల్లు అర్జున్‌కు ఆదేశం

ప్రతిపక్షం, జూన్ 20: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో హీరో అల్లు అర్జున్‌కు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా సోమవారం నాంపల్లి కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యేందుకు చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించినట్లు సమాచారం.

భద్రతా కారణాలతో పాటు ప్రస్తుతం ముంబైలో సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నందున వర్చువల్ విధానంలో విచారణకు హాజరయ్యేందుకు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే కేసు తొలి విచారణ కావడంతో నిందితుడు స్వయంగా కోర్టుకు హాజరుకావడం అవసరమని న్యాయస్థానం పేర్కొంది.

ఈ నేపథ్యంలో సోమవారం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఆయన రాక సందర్భంగా కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అభిమానుల రద్దీ, భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని అదనపు పోలీసు బలగాలను మోహరించే అవకాశం ఉంది.

గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ కేసులో అల్లు అర్జున్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకోగా, సోమవారం జరగనున్న విచారణపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Spread the love

Related News

Latest News