ప్రతిపక్షం, జూన్ 25: తుంగభద్ర జలాల అంశంపై కర్ణాటకలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై నీటి వినియోగం, ప్రాజెక్టు నిర్వహణ, పరస్పర సహకారంపై చర్చించారు. ఈ సమావేశంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి ముందు హోస్పేట్లో ఈ భేటీ జరిగింది. జల వనరుల సమర్థ వినియోగం, సాగునీటి అవసరాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాలపై నేతలు చర్చించినట్లు సమాచారం.
సాధారణంగా నదీ జలాల పంపకాల విషయంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలు, వివాదాలు చోటుచేసుకుంటుంటాయి. అయితే తుంగభద్ర ప్రాజెక్టు అభివృద్ధి, నిర్వహణ విషయంలో మూడు రాష్ట్రాలు ఒకే అభిప్రాయంతో ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరస్పర సహకారంతో జల వనరులను వినియోగించుకోవాలనే సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబించిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై సమావేశమవడం, జల సమస్యల పరిష్కారానికి సంయుక్తంగా చర్చలు జరపడం భవిష్యత్లో అంతర్రాష్ట్ర సహకారానికి కొత్త దారులు తెరవొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

















