ప్రతిపక్షం, ఆగస్టు 07: సోషల్ మీడియా దిగ్గజం మెటాకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. న్యూ మెక్సికో కోర్టు సంస్థపై 567 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,400 కోట్లు) జరిమానా విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని కోర్టు అభిప్రాయపడింది.
యువ వినియోగదారులను ఎక్కువసేపు ప్లాట్ఫామ్లలోనే ఉండేలా ఆకర్షించే విధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను రూపొందించారని, ఈ విధానం పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనాన్ని పెంచుతోందని కోర్టు పేర్కొంది. అలాగే ఆన్లైన్లో లైంగిక దోపిడీ, హానికర కంటెంట్ నుంచి చిన్నారులను రక్షించడంలో మెటా తగిన భద్రతా చర్యలు తీసుకోలేదన్న న్యూ మెక్సికో అటార్నీ జనరల్ రౌల్ టోరెజ్ వాదనలను కోర్టు సమర్థించింది.
ఈ నేపథ్యంలో మెటా సంస్థపై భారీ జరిమానా విధించడంతో పాటు, ఐదేళ్లలోపు పిల్లల భద్రతకు సంబంధించిన సమగ్ర సేఫ్టీ చర్యలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. చిన్నారుల గోప్యత, భద్రత, మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ సోషల్ మీడియా వేదికల్లో అవసరమైన మార్పులు తీసుకురావాలని స్పష్టం చేసింది.
ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా సంస్థలకు కీలక హెచ్చరికగా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.





























