[t4b-ticker]

తెలంగాణలో విమానయాన విస్తరణకు వేగం.. మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాలపై సీఎం కీలక ప్రతిపాదనలు

ప్రతిపక్షం, సెప్టెంబర్ 02: తెలంగాణలో ఆదిలాబాద్‌, వరంగల్‌ మామునూరు విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడును కోరారు. ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రితో సీఎం సమావేశమై రాష్ట్రంలోని విమానయాన రంగ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసి అప్పగించిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన రామ్మోహన్‌ నాయుడు.. మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన టెండర్లను రెండు వారాల్లో పిలవనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ నాటికి టెండర్ల ప్రక్రియను ఖరారు చేసి, అదే నెలలో పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఆదిలాబాద్‌ విమానాశ్రయ అభివృద్ధిపైనా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో చర్చించారు. విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలకు అవసరమైన టెర్మినల్‌తో పాటు కార్గో టెర్మినల్‌, విమానాల నిర్వహణ, మరమ్మతులు, సమగ్ర తనిఖీలకు ఉపయోగపడే ఎంఆర్‌వో సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల ఆదిలాబాద్‌ ప్రాంతంలో విమానయాన కార్యకలాపాలు, వాణిజ్య అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఆదిలాబాద్‌ విమానాశ్రయ రన్‌వేకు సంబంధించిన అంశాన్ని కూడా రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. రన్‌వే తుది రూపకల్పనపై రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖల మధ్య సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి త్వరగా నిర్ణయం తీసుకునేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు. రన్‌వే విషయంలో స్పష్టత వచ్చిన వెంటనే విమానాశ్రయానికి సంబంధించిన తదుపరి పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో హెలీ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. హెలికాప్టర్‌ సేవల ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తే పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని వివరించారు. పర్యాటక కేంద్రాలకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో సీ-ప్లేన్‌ ల్యాండింగ్‌కు సంబంధించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై సంబంధిత నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిపారు.

తెలంగాణలో విమానాశ్రయాల విస్తరణ, హెలీ టూరిజం, సీ-ప్లేన్‌ సేవల అభివృద్ధి ద్వారా రవాణా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పర్యాటక, పారిశ్రామిక రంగాలకు మరింత ఊతమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆదిలాబాద్‌, మామునూరు విమానాశ్రయాల పనులు ముందుకు సాగితే ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి కూడా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సమావేశంలో ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, సురేశ్‌ షెట్కార్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్‌) హర్కర వేణుగోపాలరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News