- ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు
- స్టీరింగ్ రాడ్ ఊడిపోవడమే కారణం
ప్రతిపక్షం, సెప్టెంబర్ 02, చిగురుమామిడి : హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం సుందరగిరి గ్రామ శివారులో ప్రమాదానికి గురైంది.నాలుగు వరుసల రహదారి నిర్మాణం పనులు జరుగుతుండటంతో పాటు, బస్సులో సామర్థ్యానికి మించి దాదాపు 50 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా బస్సు ఎగిరిపడింది. ఈ క్రమంలో స్టీరింగ్ రాడ్ ఉన్నపళంగా ఊడిపోవడంతో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, రహదారి పక్కనే ఉన్న స్థానిక రైతు కావటి బక్కయ్యకు చెందిన వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.ప్రమాద సమయంలో బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాకుండా కేవలం స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద శబ్దం విన్న వెంటనే గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రయాణికులను బస్సులో నుంచి బయటకు తీసి ఉపశమనం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.





























