ప్రతిపక్షం, సెప్టెంబర్ 19, శామీర్పేట్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పంక్చర్ కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి టైర్ మారుస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ప్రమాదంలో మొత్తం ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించారు.
మృతులు నాచారం ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఘటనపై శామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






























