ప్రతిపక్షం, జూలై 20: దేశ విద్యా వ్యవస్థపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. ప్రస్తుత విద్యా విధానంలో అనేక కీలక సమస్యలు ఉన్నప్పటికీ వాటిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆమె విమర్శించారు.
విద్యార్థులు తమ సమస్యలను తెలియజేసేందుకు నిరసన వ్యక్తం చేస్తే వారిపై కన్నీటి వాయువు ప్రయోగించడం, దాడులకు పాల్పడటం ఏమిటని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. విద్యార్థులను కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.
దేశంలోని విద్యార్థులందరూ మన పిల్లలేనని ఆమె అన్నారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి గొంతు వినకుండా దాడులకు పాల్పడటం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై కేంద్రం వెంటనే చర్చకు ముందుకు రావాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు.

















