ప్రతిపక్షం, జూలై 27: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ నిరసనల సందర్భంగా విద్యార్థులు, ఆందోళనకారులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. రేపటిలోగా దేశవ్యాప్తంగా నమోదైన అన్ని కేసులను ఎత్తివేయాలని, లేనిపక్షంలో తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం నిరసనకారులపై కేసులు ఉపసంహరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో విద్యార్థులు, ఉద్యమకారులపై అధిక సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.
ఈ కేసులపై ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని, చట్టపరమైన చర్యలతో పాటు ఉద్యమ కార్యాచరణపై కూడా నిర్ణయం తీసుకుంటామని సౌరవ్ దాస్ తెలిపారు. ప్రభుత్వం హామీని గౌరవించి కేసులను ఉపసంహరించుకోవాలని, లేకుంటే దేశవ్యాప్తంగా మరో దశ ఆందోళనలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.


















