Trending Now

కాంగ్రెస్‌కు డ్యామేజ్ తప్పదా.. అక్కడి నుండి రెబెల్‌గా కేంద్ర మాజీ మంత్రి పోటీ!

ప్రతిపక్షం, ఎల్బీనగర్, ఏప్రిల్ 22: తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై గత కొన్నిరోజులుగా ఆరోపణలు చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి సర్వేసత్యనారాయణ సోమవారం నాడు సంచల నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కంటోన్మెంట్ టికెట్ ఆశించగా దక్కలేదు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్, మల్కాజ్గిరి స్థానాల నుంచి టికెట్ ఆశించి భంగ పడ్డాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి సర్వేసత్యనారాయణ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

గత వారం రోజులుగా ఆయన తన శ్రేయాభిలాషులు, సన్నిహితులు, అనుచరులతో సమాలోచన జరిపుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మరో అధినేత రాహుల్ గాంధీ తో ప్రత్యక్ష సాన్నిహిత్యం ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం ఆయనకు టికెట్ రాకుండా కుట్రలు చేసినట్లు ఆయన తన అనుచరులతో ఆవేదన చెందినట్లు తెలిసింది.

మాదిగ సామాజిక వర్గంపై చిన్న చూపు..

ఒక వైపు మాదిగ సామాజిక వర్గానికి ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వక పోవడం, మరోవైపు తనకు అవకాశం దక్కకపోవడంతో సర్వే కాంగ్రెస్ రాష్ట్ర నేతలపై తిరుగుబాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఒకటి కూడా మాదిగలకు కేటాయించకపోవడం ఒక కారణం, మాదిగ సమాజిక వర్గాన్ని కావాలనే కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ అణచివేస్తున్నారని గతంలో కూడా ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాదిగల ఓట్లు అభ్యర్థుల గెలుపోటములు శాసిస్తారని అభిప్రాయ పడుతున్నారు. అత్యధిక జనాభా ఉన్న మాదిగలను కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం ఉద్దేశపూర్వకంగా అణచివేయడం పట్ల మాదిగలు మేలుకోవాలని ఆయన అంటున్నారు.

కాంగ్రెస్‌కు డ్యామేజ్ తప్పదా..

మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థి గా కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. సర్వే స్థానికుడు కావడం, రెండుసార్లు మల్కాజిగిరి నుంచి గెలవడం కేంద్రంలో మంత్రిగా పనిచేయడం, స్థానికంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టిపట్టు ఉండడం, మాస్ లీడర్ గా పేరు ఉండడం సర్వేకు ఉన్న అనుకూలాంశాలు. ఇవన్నీ కాంగ్రెస్‌కు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని స్థానిక విశ్లేషకులు అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీలో పుష్కలమైన అనుచరులు, అభిమానులు ఉన్నారని అందులో ఎస్సీ, ఎస్టీలే కాకుండా అన్ని వర్గాల వారు ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే స్వయంగా ఒప్పుకుంటున్నారు.

Spread the love

Related News

Latest News