ప్రతిపక్షం, జూలై 30: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఐదు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. జగిత్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని జిల్లా యంత్రాంగం వెల్లడించింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం కావడం, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.
అయితే ఈ సెలవును భర్తీ చేసేందుకు ఆగస్టు 8న రెండో శనివారం వర్కింగ్ డేగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. వర్షాల తీవ్రతను బట్టి అవసరమైతే మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

















