Trending Now

కాంగ్రెస్, బీజేపీలను నమ్మి ప్రజలు ఆగం కావొద్దు..

ఇప్పటికే ఆరు గ్యారెంటీలను నమ్మి ఆగమయ్యారు

కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్

ప్రతిపక్షం, కరీంనగర్, ఏప్రిల్ 29: ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఉత్తమాటలు.. ఉద్దెర హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ను నమ్మి ఇప్పటికే ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని.. మళ్లీ ఇప్పుడు బీజేపీ మాటలు నమ్మి మరో సారి ప్రజలు మోసపోతే ఇక్కడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో బడే భాయ్ నరేంద్రమోదీ కలిసి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్రలు చేస్తారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో రోడ్ షో కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. నదుల అనుసంధానం పేరుతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని, గోదావరి నీళ్లను కృష్ణ నది మీదుగా కావేరి నదిలో కలిపి తమిళనాడు కు తరలించే కుట్రలు చేస్తుందని అన్నారు. తెలంగాణ లోని గోదావరి నీళ్లను ఎత్తుకుపోవడానికి ఏమన్నా నరేంద్ర మోదీ సొమ్ము కాదని అన్నారు. గోదావరి నీళ్లను తమిళనాడు కు పట్టుకుపోవడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, గోదావరి నీళ్లు తమిళనాడు కు పోతే తెలంగాణ ఎడారి అవుతుందని, నీళ్లను కాపాడుకోవడానికి పార్లమెంట్ లో ప్రశ్నించే గళం కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థినైనా నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ లోని 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఉండాలి, కానీ తొమ్మిది పూర్వపు జిల్లాల్లోనే ఉన్నాయని..ఇంకా 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా ఒక్క నవోదయ పాఠశాల తేలేక పోయారని విమర్శించారు.

బీజేపీ పదేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. 2014 నుంచి 2019 వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ కు వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ, కొత్తపల్లి-మనోహరబాద్ రైల్వే లైన్, కరీంనగర్ లో 50 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. జాతీయ రహాదారులు కూడా తీసుకువచ్చానని పేర్కొన్నారు. ఉప్పల్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఐదేల్లలో ఎంపీ గా ఉండి బండి సంజయ్ పూర్తి చేయించలేకపోయారని విమర్శించారు. ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఒక్క గుడి తేలేదు.. ఒక్క బడి కూడా తేలేదని విమర్శించారు. రాబోయే తరాలు బాగుండాలి.. పిల్లల భవిష్యత్ కోసం కేసీఆర్ గారు ఆలోచన చేసి 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి నూట యాబై రోజులు అవుతున్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేళ్లకు ఒక్క సీఎం మారుతాడు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రద్దయ్యేది తెలీదు.. ఎప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడేది తెలువదని అన్నారు.

బీజేపీ దొంగ మాటలు.. కాంగ్రెస్ గారడీలను ప్రజలు నమ్మొద్దు : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

బీజేపీ దొంగ మాటలు.. కాంగ్రెస్ గారడీ మాయలో పడి ప్రజలు మోసపోవద్దని ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో లబ్ది పొందటానికి ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. కరీంనగర్ ఎంపీగా ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపిస్తే జోడెద్దుల్లాగా పని చేస్తామని అన్నారు. పదేళ్ళలో కేసీఆర్ ముఖ్యమంత్రి గా తెలంగాణ రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేశారని.. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు.

Spread the love

Related News

Latest News